వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. అత్యంత వేగంగా 400 పరుగులు

  • ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 400 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ
  • ఆండ్రీ రసెల్, అభిషేక్ శర్మ రికార్డులను అధిగమించిన యువ కెరటం
  • పంజాబ్‌పై 16 బంతుల్లో 43 పరుగులతో రాజస్థాన్‌కు అదిరిపోయే ఆరంభం
  • ఈ ఇన్నింగ్స్‌తో ఆరెంజ్ క్యాప్‌ను తిరిగి కైవసం చేసుకున్న వైభవ్
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రికార్డుల పరంపర కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్‌లో అత్యంత వేగంగా 400 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతను కేవలం 167 బంతుల్లోనే అందుకోవడం విశేషం. ఈ క్రమంలో ఆండ్రీ రసెల్ (188 బంతులు), అభిషేక్ శర్మ (195 బంతులు) వంటి విధ్వంసకర ఆటగాళ్ల రికార్డులను అతను అధిగమించాడు.

మంగళవారం (28న) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఈ రికార్డును అందుకున్నాడు. 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం 16 బంతుల్లో 43 పరుగులు చేసి రాజస్థాన్‌కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అతడు ఔటయ్యేసరికి 4 ఓవర్లకే జట్టు స్కోరు 51 పరుగులకు చేరింది. వైభవ్ వేసిన ఈ బలమైన పునాదిపై యశస్వి జైస్వాల్ (27 బంతుల్లో 51) కూడా రాణించాడు. ఆ తర్వాత డొనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే కీలక భాగస్వామ్యంతో రాజస్థాన్ 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఈ సీజన్‌లో పంజాబ్‌కు తొలి ఓటమిని రుచి చూపించింది. ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ ఆరెంజ్ క్యాప్‌ను తిరిగి దక్కించుకున్నాడు.

మ్యాచ్ అనంతరం వైభవ్ బ్యాటింగ్‌పై అతని ఓపెనింగ్ పార్టనర్ యశస్వి జైస్వాల్ ప్రశంసలు కురిపించాడు. "అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం అద్భుతంగా ఉంది. అతడు ఆడుతున్న తీరును మరో ఎండ్ నుంచి చూడటం చాలా ఆనందంగా ఉంది. వైభవ్ చాలా చిన్నవాడు, అతడి గురించి ఏమి చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు" అని జైస్వాల్ వ్యాఖ్యానించాడు. 

Vaibhav Sooryavanshi
IPL 2026
Rajasthan Royals
PBKS
Abhishek Sharma
Andre Russell
Nicholas Pooran

More Telugu News